Kishan Reddy : భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో భాగ్యనగరం అభివృద్ధి కాంతులతో మెరిసిపోతోంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా మాదాపూర్లోని హెచ్ఐసీసీ (HICC) కి చేరుకున్న ప్రధాని, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. సుమారు రూ. 9,400 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికారు. 2014 కంటే ముందు రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు కేంద్రం చొరవతో అవి ఎంతలా మెరుగుపడ్డాయో ప్రజలు గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. గతంలో ప్రధాని పర్యటనలకు అప్పటి ముఖ్యమంత్రులు రాకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించినా, కేంద్రం మాత్రం రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
