Site icon NTV Telugu

Kavitha : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్‌..

Kavitha

Kavitha

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఎల్బీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేసిన కవిత, పవన్ కళ్యాణ్ మాత్రం ఆనాటి నుంచి ఇనాటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ “తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైంది” అని అనడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “తెలంగాణ ప్రజలు ఏనాడూ దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది, మేము పెద్దగా ఆలోచిస్తాం,” అని ఆమె అన్నారు. తమ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా, ఎప్పుడు కూడా జై తెలంగాణ, జై ఆంధ్రా అనే తాము కోరుకున్నామని, తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్రా కూడా అంతే బాగుండాలని ఆకాంక్షించామని ఆమె స్పష్టం చేశారు.

“ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్‌లో కూడా మాట్లాడాను. పక్కోడు బాగుంటే మా కళ్లు మండవు. పక్కోనిది గుంజుకోవాలనుకునే వాళ్లం కాదు. మేము బాగుండాలని కోరుకుంటాం కానీ, పక్కోడు చెడిపోవాలని అనుకోం. అలా అనుకొని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరేలా ఉండేది. మా బిడ్డలు ప్రాణాలు త్యాగం చేశారే తప్ప, ఒక్క పరాయి రాష్ట్రం వారి మీద కూడా చేయి ఎత్తలేదు,” అని కవిత వివరించారు. ఆనాడు సినిమా నటుడిగా మాట్లాడారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అని, ఆయన మాటలు ఆంధ్రా ప్రజలకు ఆపాదిస్తారని కవిత హెచ్చరించారు. కనుక పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలని ఆమె సూచించారు.

Ibomma Ravi: పెద్ద ప్లానింగే.. భవిష్యత్ ప్రణాళికలను పోలీసులకు చెప్పిన ఐబొమ్మ రవి!

Exit mobile version