కోవిడ్ -19 ఫస్ట్ వేవ్ సమయంలో ఆకస్మిక లాక్డౌన్ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వేలాది మంది వలస కార్మికులను క్లిష్టమైన కోవిడ్ పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం గాలికి వదిలివేసిందని ఆరోపించారు. కవిత తన ట్విట్టర్ హ్యాండిల్లో “కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించింది. ఇది మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, గందరగోళానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని వలస కార్మికుల కష్టాలను కేసీఆర్ అర్థం చేసుకుని వారికి అండగా నిలిచారు.’ అంటూ ఆమె పోస్ట్ చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు విలేకరుల సమావేశంలో వలస కార్మికులను బాగా చూసుకోవడం గురించి మాట్లాడిన పాత వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. వలస కార్మికులు మా కుటుంబం లాంటి వారని, రాష్ట్ర ప్రభుత్వం వారిని అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములుగా భావిస్తోందని కేసీఆర్ పాత వీడియోలో పేర్కొన్నారు.