తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల వేదికగా గులాబీ జెండా పట్టుకున్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన ప్రజాకంటకంగా మారిందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తిరిగి కేసీఆర్ నాయకత్వమే అవసరమని ఆయన స్పష్టం చేశారు.
దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాను, ఎప్పుడూ పార్టీకి కీడు కోరలేదని జీవన్ రెడ్డి భావోద్వేగంతో చెప్పారు. అయితే, రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే తీరు వల్లనే తాను బయటకు రావాల్సి వచ్చిందని వివరించారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంలో రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. “రేవంత్ రెడ్డి ఆలోచనా విధానం వల్ల కాంగ్రెస్కే ప్రమాదం ఉంది, అందుకే ఆయన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది” అని ఎద్దేవా చేశారు.
Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!
గతంలో తాను శాసనసభలో, మండలిలో కేసీఆర్ విధానాలను ప్రశ్నించినప్పటికీ, అవి నిర్మాణాత్మకమైన విమర్శలేనని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనను చూస్తుంటే, “ఈయన కంటే కేసీఆర్ గారే నయం” అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పునర్నిర్మాణంపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి కావాలనే కాలయాపన చేస్తూ, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికల పేరుతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమైపోయాయని ధ్వజమెత్తారు.
Babu Mohan : పద్మ అవార్డు వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు!
జగిత్యాల నుంచి మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, అభ్యర్థి ఎవరనేది అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. తన వ్యక్తిగత పదవుల కంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన రేవంత్ రెడ్డి పాలనను అంతమొందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదంతోనే తన తదుపరి రాజకీయ ప్రయాణం ఉంటుందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
