Indrasena Reddy On Alliance With TDP And Munugodu Elections: తమ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకోదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో గానీ, ఏపీలో గానీ చంద్రబాబుతో కలిపి పని చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతంలో ఆయనతో బీజేపీ కలిపి పని చేసిందని, కానీ ఈసారి టీడీపీతో పొత్తు ప్రశ్న ఉత్పన్నం కాదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఉప ఎన్నికలను టీఆర్ఎస్ లైట్ తీసుకుంటే, మునుగోడులో ఉప ఎన్నిక రాకపోవచ్చన్నారు. మునుగోడులో తాము ఒంటరిగా పోటీ చేసినప్పుడు భారీగా ఓట్లు వచ్చాయని, తమకు అక్కడ ఓట్లు ఉన్నాయని అన్నారు. అయితే.. రాహుల్ గాంధీ వచ్చినా, మునుగోడులో కాంగ్రెస్ గెలవదని ఇంద్రసేనా రెడ్డి జోస్యం చెప్పారు. కమ్యూనిస్టులు ఎప్పుడు మునుగోడులో ఒంటరిగా గెలవలేదన్నారు.
దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గాల్లో కూడా బలమైన అభ్యర్థులు ఉండటం వల్లే బీజేపీ గెలిచిందన్నారు. మునుగోడులోనూ బలమైన అభ్యర్థికే ఓట్లు పడతాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంతో రాజగోపాల్ రెడ్డి నిరంతరం టచ్లోనే ఉన్నారన్నారు. తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు. అంతకుముందు కూడా కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో వున్నారని ఇంద్రసేనా రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్ధులు మిగలరన్నారు. అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని ఎంత వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించేందుకు తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలవడం తథ్యమని ఇంద్రసేనా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.