HYDRAA: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం, కమిషనర్ కోర్టు ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘించారని తేల్చిచెప్పింది. ఈ మేరకు రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని హైకోర్టు ఆదేశిస్తూ జడ్జిమెంట్ కాపీలో సంచలన అంశాలను వెల్లడించింది.
చట్ట ఉల్లంఘన సహించేది లేదు.. కోర్టు సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, మనుషులతో ప్రవేశించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సందర్బంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చించిన ‘టాటా మోహన్ రావు’ కేసు ఉత్తర్వులను హైకోర్టు ప్రస్తావించింది. “శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం ఔన్నత్యం ఉంది” అని పేర్కొంటూనే, పాలనలో చట్టం పరిధి దాటి వెళ్లకూడదని హెచ్చరించింది.
“రాష్ట్రంలో ఎప్పుడైనా చట్టం పాలన మాత్రమే కొనసాగాలి తప్ప వ్యక్తుల పాలన కాదు. ఒకవేళ అధికారుల లేదా వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుంది. ఈ కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ” అని న్యాయస్థానం తన తీర్పులో అత్యంత ఘాటుగా అభిప్రాయపడింది. చట్ట నియమాలను పక్కనబెట్టి వ్యవహరించే వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని స్పష్టం చేస్తూ, రంగనాథ్ స్థానంలో వేరే అధికారిని బాధ్యతల్లోకి తీసుకోవాలని సీఎస్ను కోరింది.

