వివాదాస్పద వీడియోలతో వార్తల్లో నిలుస్తున్న యూట్యూబర్ అన్వేష్కు ఉచ్చు బిగుస్తోంది, అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ, సామాజిక నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీసులు ఇప్పుడు అతడి డిజిటల్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా అన్వేష్కు చెందిన సోషల్ మీడియా ఖాతాలను శాశ్వతంగా నిలిపివేయాలని పోలీసులు నిర్ణయించారు. అన్వేష్ తన వీడియోల ద్వారా అసభ్యకరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అతడి అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా సంబంధిత సంస్థలకు లేఖలు రాయనున్నారు. అన్వేష్కు చెందిన రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, రెండు యూట్యూబ్ ఛానళ్లను తక్షణమే నిలిపివేయాలని పోలీసులు కోరనున్నారు. రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగంతో పాటు పంజాగుట్ట ఏసీపీ కార్యాలయం నుండి ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలను ఆయా ప్లాట్ఫామ్ల ప్రతినిధులకు పంపాలని అధికారులు నిర్ణయించారు.
Also Read:Maruthi : మారుతికి హీరో కావలెను!
ఇప్పటికే అన్వేష్పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, చట్టపరమైన చర్యలు మొదలైనప్పటికీ అన్వేష్ ఏమాత్రం తగ్గడం లేదు. “నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ ఇటీవల ఆయన ఒక వీడియో విడుదల చేయడం పోలీసుల ఆగ్రహానికి కారణమైంది. తన ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయినప్పటికీ, తనకు మరిన్ని ప్రత్యామ్నాయ ఖాతాలు ఉన్నాయంటూ ఆయన సవాల్ విసరడం గమనార్హం. గతంలో కూడా అన్వేష్ చేసిన కొన్ని వీడియోలు వివాదాస్పదంగా మారాయి. అసభ్యకరమైన పదజాలం వాడుతూ సమాజంపై తప్పుడు ప్రభావం చూపిస్తున్నాడనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. లుకౌట్ నోటీసులతో పాటు ఇప్పుడు డిజిటల్ అకౌంట్లను కూడా మూసివేయిస్తుండటంతో అన్వేష్కు ఇకపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికలు లేకుండా చేసేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు.