CM Revanth Reddy: తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 విజన్ అద్భుతంగా ఉందని యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్) మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసించారు. 1997-2007 మధ్య పదేళ్ల పాటు యూకేకు ప్రధానిగా సుదీర్ఘకాలం ఇంగ్లాడ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన టోనీ బ్లెయిర్.. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్, వ్యూహ రచన.. వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBIGC) అనే సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా భారత్ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్తో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (జూన్ 19న) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు లాంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్కు సీఎం తెలియజేశారు.
Read Also: Chittoor Crime: దారుణం.. తన కూతురుని కోడలిగా చేసుకోలేదని స్నేహితురాలి హత్య..! కులాలే కారణమా..?
ఇక, మానవ అభివృద్ధి సూచికల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పట్టణ, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమలు చేయబోయే సూక్ష్మ ప్రణాళికను యూకే మాజీ ప్రధాని బ్లెయిర్ కి సీఎం తెలియజేశారు. తెలంగాణ రైజింగ్ 2047 ముఖ్య అంశాలను వివరిస్తూ.. ఈ విజన్ను 2025, డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు వెల్లడించనున్నట్లు తెలిపారు. సుస్థిరాభివృద్ధి దిశగా ప్రణాళికలు ఉండటాన్ని యూకే మాజీ ప్రధాని ప్రశంసించారు. “భారత్ ఫ్యూచర్ సిటీ,” “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ,” “యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ” లాంటి ప్రాజెక్టులపై టోనీ బ్లెయిర్ ఆసక్తి చూపారు. ఈ విషయాలై ఇరువురు గంటకు పైగా సమావేశమైన అనంతరం తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, TBIGC ప్రతినిధులు ఉద్దేశ పత్రాన్ని (Letter of Intent) పరస్పరం మార్చుకున్నారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర పారిశ్రామిక, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్ రంజన్, పారిశ్రామిక, వాణిజ్య విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, TBIGC ప్రతినిధులు పాల్గొన్నారు.