బైక్, కార్ ఇలా తాము వాడే వాహనంపై చలాన్లు ఉండటం.. రోడ్డుపైకి రాగానే పోలీసులు ఏ పక్క నుంచి వచ్చి ఆపి చలాన్ కట్టమంటారోనని భయంతో కాలం వెళ్లదీస్తున్న ఎంతో మంది వాహనాదారులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. పెండింగ్ చలానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల హైదారబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న చలానాలకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ మార్చి 1 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు కొత్త ప్రతిపాదన పోలీస్ శాఖ అధికారులు తీసుకువచ్చారు.
2 వీలర్ వాహనదారులు పెండింగ్ చలాన్లో 25 శాతం చెల్లింపుకు అవకాశం కల్పించనున్నారు. మిగతా 75 శాతాన్ని అధికారులు మాఫీ చేయబోతున్నారు. అంతేకాకుండా కార్లకు 50 శాతం, ఆర్టీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు పోలీస్ శాఖ అవకాశం కల్పించనుంది. ఆన్లైన్, మీసేవా, ఆన్లైన్ గేట్వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.