Huzurabad : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం దాడుల వరకు వెళ్లింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపైకి దూసుకెళ్లారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు తొలుత కరీంనగర్లో ఆందోళనకు దిగారు. అక్కడ గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన పోలీసులు, భారీ బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి హుజూరాబాద్కు తరలించారు.
కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ చేరుకున్నాక, అక్కడ కార్యకర్తలతో సమావేశమవుతుండగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి అనుచరులు కర్రలతో అడ్డుకున్నారు. పోలీసుల కళ్లముందే ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. బీఆర్ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేయగా, బీజేపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి.
పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. ఘర్షణకు కారణమైన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు క్యాంప్ కార్యాలయ గేట్లు వేసి లోపలే ఉంచేశారు. ఈ ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. తనపై హత్యాయత్నం జరిగిందని, రాడ్లు, కత్తులతో దాడులు చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం హుజూరాబాద్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు జిల్లాలో శాంతిభద్రతలపై చర్చకు దారితీశాయి.
