వేసవి సెలువు వచ్చిందటే చాలు.. పిల్లలకు కేరింతలు కొడుతూ సందడి చేస్తుంటారు. పరీక్షల తరువాత తమ పిల్లలను టూర్కో.. ఆహ్లాదకరమైన ప్రదేశాలకో తీసుకెళ్తుంటారు. అయితే ఎంతో మంది హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ను కూడా సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా నెహ్రూ జూ పార్క్ పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. ఈ రోజు కూడా భారీగా పర్యాటలకు రావడంతో జూ పార్క్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. వీకెండ్లోనే కాకుండా ఈ వేసవి కాలం కారణంగా.. మాములు రోజుల్లోనూ పార్కును విజిట్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందంటూ జూ అధికారులు చెప్తున్నారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 5 నుంచి 6 వేల మంది వస్తుండగా.. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 10 వేలకు పైగానే ఉంటోందని అధికారులు వెల్లడిస్తున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల నుంచి జనాలు వస్తుండటంతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పార్కు లోపల అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా రూల్స్ పాటిస్తూ మాస్క్ను తప్పనిసరి చేశారు. ప్లాస్టిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లనివ్వట్లేదు. రద్దీ పెరుగుతుండటంతో నడుచుకుంటూ వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుందని పార్కులో సైక్లింగ్ను ఆపేసినట్లు అధికారులు చెప్తున్నారు. వేసవి కావడంతో లోపల సేదతీరేందుకు బెంచీలు, డ్రింకింగ్ వాటర్ పాయింట్లను పెంచామన్నారు.