వర్షం వచ్చందంటే చాలు హైదరాబాద్లో మురికి కాలువలు పొంగిపొర్లుతుంటాయి. దీంతో మురికి నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు జీహెచ్ఎంసీపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వరద నీటి రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్లు జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాకుత్ పురా స్థానికులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ నెలలో వర్షం నీరు ఇండ్లల్లోకి చేరడంతో ఆస్తి నష్టం వాటిల్లిందని బస్తీ ప్రజలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా మే 19న విచారణకు హాజరు కావాలని బల్దియా అధికారులు, కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేసింది.