మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని ఆయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డాం. ఈ పరిస్థితి గమనించిసీఎం గారు 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు.
ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కి చేరుకున్నాం. మరో2౦౦ మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం. త్వరలో ఇది ప్రారంభమవుతుంది.రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదు. వైద్య రంగంలోగుణాత్మక మార్పులు తెచ్చాం. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోంది. రెండం , మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గింది. అయినా అలసత్వం వద్దు. అందరం మాస్క్ ధరిద్దాం, వాక్సిన్ వేయించుకుందాం. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న ఆయన తొలి స్థానంలో నిలవాలన్నారు.