తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని… దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సోమేష్ కుమార్ వెల్లడించారు.
ఇప్పటికే టీఎస్పీఎస్పీ గ్రూప్ 1 కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. విద్యాశాఖ కూడా పోస్ట్ భర్తీకి క్లియరెన్స్ ఇచ్చాయని.. టెట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని సోమేష్ కుమార్ వెల్లడించారు.
రోస్టర్ పాయింట్లు, సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29 తేదీ లోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అందచేయాలని సంబంధిత శాఖ అధికారులను సోమేష్ కుమార్ ఆదేశించారు. మంజూరైన అన్ని జూనియర్ అసిస్టెంట్ , తత్సమాన పోస్టులను చేర్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్ లతోని ప్రమోషనల్ ఖాళీలను కూడా భర్తీ చేయాలని… హెచ్ ఓడీలు వ్యక్తిగత దృష్టిని పెట్టాలి, తద్వారా ప్రక్రియ సమయాన్ని తగ్గించాలని సోమేష్ కుమార్ ఆదేశించారు.