తెలంగాణలో ప్రభుత్వానికి-రాజ్ భవన్ కి మధ్య అగాథం పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. వరుస పర్యటనల్లో ఆమెకు అవమానంగా జరుగుతోందని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. స్రోటోకాల్ సమస్య పై చెప్పాల్సిన చోట చెప్పానన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ పట్ల అధికారులు అనుసరిస్తున్న ప్రోటోకాల్ సమస్యపై చెప్పాల్సిన చోటే తాను చెప్పానని ఇప్పుడు దాని గురించి మాట్లాడేది ఏమీ లేదని గవర్నర్ తమిళ సై వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు రోజుల నుంచి గవర్నర్ పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన పై దాటవేత ధోరణి లో మాట్లాడారు. పుసుకుంట్ల గిరిజన గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్ పై ఇప్పటికే తాను కేంద్రానికి సమాచారం ఇచ్చానన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మారుమూల అటవీ ప్రాంతంలోని పూసుకుంటను తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సందర్శించారు. సుమారు ఎనిమిది కిలోమీటర్ల అటవీ ప్రాంతం గుండా ప్రయాణించి పూసుకుంటకు చేరుకున్న గవర్నర్ కు గ్రామస్థులు గిరిజన సాంప్రదాయ వస్త్రధారణ డప్పు వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానం పలికారు.

Ts Governor tamilisai soundarajan
ముందుగా అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ గిరి పోషణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పౌష్ఠికాహార స్టాల్ ను పరిశీలించారు. గవర్నర్ గ్రాంట్ తో గోగులపూడి, పూసుకుంట లలో వేర్వేరుగా రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ హాళ్లు, రూ.8 లక్షల తో పూసుకుంట ప్రాథమిక పాఠశాల భవనం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత గ్రామంలోని కొందరి ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. పర్యటనలో భాగంగా ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంపు ను ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీలు పాల్గొన్న సభకు హాజరైన గవర్నర్ తెలుగులో ప్రసంగించారు.
https://ntvtelugu.com/once-again-bandi-sanjay-made-comments-on-cm-kcr-2/
మీ గ్రామానికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. మారుమూల గిరిజన పల్లెలు అభివృద్ధి చెందాలన్నారు. మారుమూల గ్రామాల్లో పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండటం కలచివేస్తుంది అన్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సభకు వచ్చిన వారి కోసం సిద్ధం చేసిన వంటకాలను వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం కొత్తగూడెం పయనమై వెళ్లారు.