Gajendra Singh Shekhawat Comments On Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి హద్దులు దాటిందని.. ఇది తెలంగాణ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన ఆరోపణలు చేశారు. భారీ వర్షాల కారణంగా మూడు పంప్హౌజ్లు మునిగిపోయాయని, పంప్లను టెక్నికల్గా సరైన పద్ధతిలో అమర్చకపోవడం వల్లే ఆ విపత్తు సంభవించిందని అన్నారు. ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేలకోట్ల అవినీతి జరిగిందని, పంప్ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉండొచ్చని అన్నారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని, వాటిని అమర్చడంలో సరైన పద్దతి పాటించలేదు కేంద్రమంత్రి దుయ్యబట్టారు.
అంతకుముందు రెండు వారాల కిందట కూడా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వర ప్రాజెక్ట్ రాంగ్ డిజైన్ అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌజ్లు మునిగాయని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ను కట్టారని అన్నారు. సీఎం కేసీఆర్కు ఈ ప్రాజెక్ట్ ఒక ఏటీఎంలా మారిందని ఆరోపించారు. డబ్బుల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి లెక్కలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి పరులను జైల్లో వేసేందుకే బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరిన ఆయన.. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి నిజమైన నివాళి ఇవ్వాలంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిందేనన్నారు.