అతడొక విద్యాబుద్దలు నేర్పాల్సిన గురువు.. అంతేకాకుండా తాను ఇప్పుడు విద్యార్థులకు భవిష్యత్తుకు పునాదైని పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు ఏకంగా అదే ఎగ్జామ్ సెంటర్కి పూటుగా మద్యం తాగి వచ్చి తూలుతూ తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించాడు. హుజురాబాద్ లోని రాంపూర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల పీఈటీ టీచర్ ఆముల రవికుమార్ డ్యూటీలో ఉండగా మొదట ఎగ్జామ్ కి వచ్చిన విద్యార్థులకు అనుమానం వచ్చింది. తన ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా అనిపించింది.
ఇదే విషయంపై ఇన్స్పెక్షన్ విధులకు వచ్చిన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావుకి కూడా అనుమానం వచ్చింది. దీంతో సదరు టీచర్ను ప్రశ్నించగా గుప్పున వాసన గుబాలించడంతో.. ఇక వెంటనే స్థానిక పోలీసులను పిలిపించి సదరు టీచర్ కి ఎగ్జామ్స్ సెంటర్ లోనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. మామూలుగా 30 ఉండాల్సిన మద్యం స్థాయిలు ఏకంగా 112 చూపించాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత విద్యాధికారులు వెంటనే రవికుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు, ఇదే అంశంపై జిల్లా విద్యాధికారి సీహెచ్వీఎం జనార్దన్ రావు మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించే ఎవరినైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు ఉపాధ్యాయుడికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి అతనితో పాటు సెంటర్ సూపరిండెంట్ ని సైతం నిర్లక్ష్య ధోరణి కారణంగా విధుల్లో నుంచి తొలగించడం జరిగిందని వెల్లడించారు.