నేడు ఉదయం 8 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. వరద ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నిన్న రాత్రి వరంగల్లోనే బస చేసారు. నేడు ఉదయం వరంగల్ నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుని సీఎం కేసీఆర్ ఓటు వేయనున్నారు. సీఎం కేసీఆర్తో పాటే వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్లో పాల్గొననున్నారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నేడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకే ఓటు వేసే అవకాశం ఉంది.
కాగా.. దేశ 16వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఇవాళ ఓటింగ్ జరుగనుంది. ఈనేపథ్యంలో.. ఇందుకోసం రాష్ట్ర శాసనసభలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు సహా రాష్ట్రానికి చెందిన మంది శాసనసభ్యులు అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. టీఆర్ ఎస్ తోపాటు మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు యశ్వంత్ సిన్హాకే మద్దతు ప్రకటించాయి. బీజేపీకు చెందిన ముగ్గురి మద్దతు మాత్రమే రాష్ట్రంలో ద్రౌపది ముర్ముకు ఉంది. టీఆర్ ఎస్ శాసనసభ్యులు నేడు ఉదయం తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్లో పాల్గొని ఆ తర్వాత.. అక్కడి నుంచి బస్సుల్లో అసెంబ్లీకి వచ్చి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. టీఆర్ ఎస్ తరపున ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హన్మంత్ షిండే ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. కాంగ్రెస్ సభ్యులు ఉదయం 9 గంటలకు శాసనసభ చేరుకోనున్నారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా ఉండనున్నారు. అయితే.. ఎమ్మెల్యే రఘునందన్రావు బీజేపీ ఏజెంట్గా వ్యవహరించనున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కందుకూరు శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి హైదరాబాద్కు వచ్చి తన ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
అయితే.. బ్యాలెట్ పత్రంలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పేరు మొదట, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేరు తర్వాత ఉన్నాయి. ఈనేపథ్యంలో.. ప్రాధాన్యతకు అనుగుణంగా వారి పేర్ల ఎదుట 1 అంకె వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, వేరే పెన్ ఉపయోగిస్తే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. ఈనేపథ్యంలో.. పోలింగ్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి కృష్ణకుమార్ ద్వివేదిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకునిగా నియమించింది. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, సహాయ రిటర్నింగ్ అధికారులు ఉపేందర్ రెడ్డి.. ప్రసన్నకుమారితో కలిసి ఆయన ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. ఈయితే.. పోలింగ్ నేపథ్యంలో శాసనసభ పరిసరాలు, ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాసనసభ్యులను మినహా మిగతా ఎవరినీ భవనం లోపలికి అనుమతించడం లేదు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సును స్టోర్ రూంలో భద్రపరుస్తారు. 19న (రేపు) ఉదయం బ్యాలెట్ బాక్సును దిల్లీ తీసుకువెళ్తారు.
Presidential Poll 2022: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధం