ప్రగతి భవన్ జనహితలో ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లోని జనహితలో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని సీఎస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదపండితుల ఆశీర్వచనం అనంతరం బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మచే పంచాంగ పఠనం ఉంటుందని తెలిపారు.
వేదపండితులకు ఉగాది పురస్కారాలు అందచేసిన అనంతరం ముఖ్యమంత్రి సందేశం ఉంటుందని అన్నారు. అదేరోజు సాయంత్రం రవీంద్ర భారతి లో కవిసమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాఖలు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తాయని తెలిపారు. ఉగాది ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ లోని కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.