అగ్నిపథ్ స్కీమ్ అగ్గి రాజేసింది.. దేశ్యాప్తంగా ఆ పథకాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు యువత.. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. విధ్వంసం కూడా జరిగింది.. ఇక, ఆ ఆందోళనలు, విధ్వంసం వెనుక ఉన్నవారి వివరాలను రాబట్టేపలో పడిపోయారు పోలీసులు.. అయితే, అగ్నిపథ్ విషయంలో మాత్రం కేంద్రం వెనక్కి తగ్గడం లేదు.. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. ఇక, అగ్నిపథ్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. యువకులను గాలికి వదలం కటింగ్ షాపులు, ఇస్త్రీ షాపులు, చెప్పుల షాపులు పెట్టుకోవచ్చని కేంద్రమంత్రి అంటున్నారు.. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయోచ్చని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
Read Also: Viral: ఘనంగా శునకం బర్త్ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్ టచ్ కూడా ఉందట..!
ఇక, సికింద్రాబాద్లో ఫైరింగ్ విషయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. పోలీసు ఆఫీసర్లు దద్దమ్మలు అని వ్యాఖ్యానించిన ఆయన.. బులెట్ మిస్ఫైర్ ఆయ్యిందని అంటున్నారు.. పోలీసులు వెళ్లి గాడిదలు మేపుకొండి అంటూ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ పోరాటంలో రాకేష్ పై జరిగిన కాల్పుల విషయంలో పోలీసుల మాట్లాడిన తీరు సరికాదన్నారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి అంటాడు తప్ప ఏ దానికి సిద్ధంగా ఉండడు అని సెటైర్లు వేశారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా మరో అభ్యర్థిని పెట్టేందుకు కేసీఆర్, వైఎస్ జగన్ ముందుకు రావాలని సూచించారు.. ఇక, తెలంగాణలో భూముల రేట్లు కోట్లు పలుకుతున్నాయని సీఎం కేసీఆర్ అంటే.. జహీరాబాద్ వచ్చిన కేటీఆర్ నిమ్జ్ రైతులకు ఐదు లక్షలు పరిహారం ఇస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. న్యాయం కోసం నిమ్జ్ రైతులు ఎదురు చూస్తుంటే వారిపై లాఠీఛార్జి చేయిస్తారా? అని మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ.