హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో భాగంగా, ఇప్పటివరకు వేర్వేరు సందర్భాలలో రూ. 3,29,36,830 నగదును పట్టుకున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రూ. 6,36,052 విలువగల 944 లీటర్ల మద్యం, రూ. 69,750 రూపాయల విలువగల 11.4 కేజి లు గంజాయి, రూ.44,040 రూపాయలు విలువగల పేలుడు పదార్థాలను, రూ. 2,21,000 విలువగల చీరలు, చొక్కాలను, రూ. 10,60,000 రూపాయలు విలువగల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు అల్లరి సృష్టించే 2,284 మంది వ్యక్తులను గుర్తించి తహసీల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. బైండోవర్ నియమావళి ఉల్లంఘించి మళ్ళీ నేరానికి పాల్పడిన ఎల్కపల్లి సంపత్ అనే వ్యక్తిని ఉల్లంఘన నేరం క్రింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రింద వివిధ పార్టీల పై 116 కేసులు నమోదు చేయడం జరిగిందని, ఈ రోజు రాత్రి 07 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసిందని తెలిపారు. కావున కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రచార గడువు ముగిసిన తరువాత స్థానికేతర వ్యక్తులు ఆ నియోజకవర్గం ను వదిలి వెళ్ళిపోవాలని.. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేటి రాత్రి 7 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు గల 72 గంటలు కాలాన్ని నిశ్శబ్ద కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం విధించిందన్నారు. ఇద్దరు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 65 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 2000 మంది పోలీస్ సిబ్బంది తో పాటు 22 కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.