తెలంగాణలో కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. సెకండ్ వేవ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా సోకిన వ్యక్తులను ఇంటి యజమానులు అనుమానంతో చూస్తున్నారు. తాజాగా, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో అంబేద్కర్ నగర్ లో నివశించే ఓ మహిళకు కరోనా సోకింది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే సదరు మహిళను ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ మహిళ స్థానిక కూరగాయల మార్కెట్లోనే ఉండిపోయింది. అయితే, మరుసటి రోజున ఆ మహిళను మార్కెట్ నుంచి పంపించేశారు. దిక్కుతోచని స్థితిలో మహిళ సులబ్ కాంప్లెక్ వద్ద తోడుపుబండిపైనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ ఈరోజు మృతి చెందింది. కరోనా సోకిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఉంటె పరిస్థితి వేరుగా ఉండేదని వైద్యులు చెప్తున్నారు.