కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు. అలాగే సైబరాబాద్లో 150 మంది పోలీసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 110 మందికి వైరస్ సోకినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు సీరియస్ క్రైమ్స్విషయంలో తప్ప బాధితులు కంప్లయింట్ చేసేందుకు పీఎస్కు రావొద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దానికి బదులుగా ఆన్లైన్లో కంప్లయింట్ చేయాలంటున్నారు. కొన్ని పీఎస్ల పరిధిలో కంప్లయింట్స్ ఫైల్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా తగ్గేవరకూ తమ సూచనలు పాటించాలంటున్నారు పోలీసు అధికారులు.
రాష్ట్రంలో కొత్తగా 2,983 కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనా సోకి మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో మరో 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 22,472 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
