మాదిగ సామాజిక వర్గ హక్కుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్’ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం తనకు గర్వకారణమని చాటిచెప్పారు.
గత ఇరవై ఏళ్లుగా మాదిగ వర్గీకరణ పోరాటాన్ని తాను దగ్గరుండి చూస్తున్నానని సీఎం గుర్తు చేసుకున్నారు. “నాడు అసెంబ్లీలో వర్గీకరణ కోసం గళమెత్తితే, అప్పటి పాలకులు నన్ను, సంపత్ కుమార్, సండ్ర వెంకటవీరయ్యను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ నేను మిత్ర ధర్మాన్ని మరువలేదు” అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మహాభారతంలోని కర్ణుడు, బార్బరికుడి పాత్రలను ఉదాహరణగా చూపుతూ.. బలహీనుల పక్షాన నిలబడి పోరాడటమే తన నైజమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులే ఈ పాలనకు కళ్లు , బ్రాండ్ అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలంటే అది ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారని, వాటిని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందని గుర్తు చేశారు. రాబోయే 99 రోజులు ఒక దీక్షలా పనిచేస్తే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, ఒక్కరోజు పని చేయకున్నా సామాన్యులు ఇబ్బంది పడతారని సూచించారు.
వర్గీకరణతో అన్ని సమస్యలు పరిష్కారం కాలేదని అంగీకరిస్తూనే, భవిష్యత్తులో అన్ని అడ్డంకులను అధిగమిస్తామని భరోసా ఇచ్చారు. “ముందుండి నేను సమస్యలను పరిష్కరిస్తాను, వెనక నుండి జరిగే రాజకీయ దాడులను మీరు చూసుకోవాలి” అని ఉద్యోగ వర్గాలకు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఖజానా పరిస్థితిని వివరిస్తూనే, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్తో పాటు పలువురు మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు , ప్రజాప్రతినిధులు పాల్గొని మాదిగ సామాజిక వర్గ అభివృద్ధికి తమ మద్దతును ప్రకటించారు.
T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్కు నామినేట్..