CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం

  • రూ. 1,011 కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లకు శ్రీకారం
  • 60 రోజుల్లో 11 వేల టీచర్ పోస్టుల భర్తీ: సీఎం
  • ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య
  • నాణ్యతలేని ఎడ్యుకేషన్ కిట్లపై సీఎం సీరియస్ వార్నింగ్
Cm Revanth

Cm Revanth

తెలంగాణ గడ్డపై విద్యా విప్లవానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, విద్యార్థుల భవిష్యత్తును మార్చే దిశగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా రూ. 1,011 కోట్లతో క్యూర్ (CORE) ప్రాంతంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విద్యాశాఖ స్టాల్స్ ను సందర్శించిన సీఎం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. “తెలంగాణ సమాజం బలోపేతం కావాలంటే విద్య, వైద్యం అందరికీ సమానంగా అందాలి. అందుకే విద్యాశాఖను వేరే ఎవరికీ ఇవ్వకుండా నేనే నా దగ్గర పెట్టుకున్నాను. సమీక్షల సమయంలో నన్ను సీఎంగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి. తండాలు, గూడాలు, మారుమూల గ్రామాల్లోని పేద బిడ్డలకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. అవుటర్ రింగ్ లోపల ఉన్న విద్యా సంస్థల అభివృద్ధి కోసం రూ. 1,700 కోట్లతో ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వ విద్యపై తమకున్న చిత్తశుద్ధిని చాటుతూ, కేవలం 60 రోజుల్లోనే 11,000 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని సీఎం గుర్తు చేశారు. దాదాపు 22 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు, ఎంతో క్లిష్టమైన 36 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ విజయాలను నీతి ఆయోగ్ సైతం అభినందించిందని ఆయన గర్వంగా ప్రకటించారు. ప్రభుత్వ టీచర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు 25 మందిని ఇప్పటికే ఫిన్లాండ్ పంపించామని, రాబోయే రోజుల్లో మరో 500 మంది ప్రతిభావంతులైన టీచర్లను విదేశీ శిక్షణకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

“రాష్ట్రంలో 12 వేల ప్రైవేట్ స్కూళ్లలో 38 లక్షల మంది ఉంటే, 27 వేల ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న గొప్పతనం ఏమిటి? ప్రభుత్వ స్కూళ్లలో లోపం ఏమిటి? అని ప్రశ్నించుకోవాలి. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను ప్రవేశపెడుతున్నాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన 8 శాతం నిధులను క్రమంగా 15 శాతానికి పెంచుతామన్నారు. 100 నియోజకవర్గాల్లో రూ. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని, ఇక్కడ చదువుకున్న పేద బిడ్డలు గర్వంగా తమ పాఠశాల పేరు చెప్పుకోవాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల సంక్షేమం కోసం కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం, డైట్ ఛార్జీలను 40 శాతం పెంచినట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాలు, రాగిజావతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తామని, కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నామని చెప్పారు. అలాగే రూ. 1,000 కోట్లతో ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని, ఈ వస్తువుల నాణ్యతను తానే స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. “విద్యార్థులకు నాణ్యత లేని వస్తువులను సరఫరా చేసే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టడమే కాదు.. వారిని బొక్కలో తోయించే బాధ్యత నాది” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

ఉపాధ్యాయులపై నమ్మకం ఉంచుతూ, వారికి ఒకటో తారీఖునే జీతాలు అందజేస్తున్నామని సీఎం చెప్పారు. “టీచర్లకు ఇది కేవలం ఉద్యోగం కాదు.. అదొక బాధ్యత. 19 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పేద తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పనిచేయాలి” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావని, అవి అభివృద్ధి వేదికలని చాటిచెప్పేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.