CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తూ భారీగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దపీట వేస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా పన్నుల పునఃపంపిణీలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన గణాంకాలతో సహా ఎండగట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న ప్రతి రూపాయికి ప్రతిఫలంగా రాష్ట్రానికి కేవలం 42 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలపై గొడ్డలి పెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర పన్నుల వాటా పంపిణీలో ఉత్తరాది రాష్ట్రాలకు అందుతున్న నిధులపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల నుంచి నిధులను సేకరించి, ఇతర రాష్ట్రాలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ (UP) రూపాయి పన్ను చెల్లిస్తే కేంద్రం ఆ రాష్ట్రానికి 2 రూపాయలు తిరిగి ఇస్తోందని, ఇక బీహార్ విషయానికొస్తే రూపాయికి బదులుగా ఏకంగా 6 రూపాయలు నిధులుగా వెళ్తున్నాయని ఆయన వివరించారు. ఈ స్థాయి వివక్షపై తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడైనా పార్లమెంట్లో నోరు మెదిపారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించినందుకు తెలంగాణకు మీరు చేసిన మేలేమిటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పైకి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ, లోపల మాత్రం ఆ రెండు పార్టీలు ఒక్కటేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్రం ప్రవేశపెట్టిన వివాదాస్పద రైతు వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ బేషరతుగా మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, నోట్ల రద్దు సమయంలో కేసీఆర్ అసెంబ్లీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ ప్రధాని మోదీని అభినందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. “మోదీ ప్రేమలో అమరత్వం పొందుతానని గతంలో కేసీఆర్ చెప్పలేదా?” అని ఆయన ఎద్దేవా చేశారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం బయటపడదని అనుకుంటున్నారని, కానీ బీఆర్ఎస్ , బీజేపీ మధ్య పక్కాగా ‘క్విడ్ ప్రో కో’ ఒప్పందం నడుస్తోందని ఆయన ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అత్యంత ఖరీదైన ఫార్ములా-ఈ కారు రేస్ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ ఈడీ (ED) వద్ద ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసినా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని అడిగారు. బీఆర్ఎస్ నాయకులను కాపాడేందుకే బీజేపీ ఈ కేసులను అటకెక్కించిందని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తన ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని, కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసాను సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. ఇంకో కేసులో 14 రోజుల రిమాండ్..