Supreme Court: దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల డబ్బు రక్షణలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేసింది. అనుమానాస్పద లావాదేవీలు జరిగితే ఖాతాదారులకు తక్షణమే అలర్ట్ ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అకస్మాత్తుగా భారీ మొత్తాల లావాదేవీలు జరిగితే బ్యాంకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. అవసరమైతే ఆ లావాదేవీలపై తాత్కాలికంగా హోల్డ్ పెట్టే అధికారం బ్యాంకులకు ఉండాలని స్పష్టం చేసింది.
Read Also: Neena Gupta : సెట్లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని
వృద్ధులు, సాధారణ ఖాతాదారులే లక్ష్యం
డిజిటల్ అరెస్ట్ స్కామ్లలో ప్రధానంగా వృద్ధులు, సాధారణ ఖాతాదారులే బాధితులవుతున్నారని పేర్కొంది సుప్రీంకోర్టు… ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు అత్యంత తీవ్రమైనవిగా అభివర్ణించింది. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేందుకు AI, ఆధునిక టెక్నాలజీని బ్యాంకులు వినియోగించాలి అని ధర్మాసనం సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) ను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
కేంద్రం–RBI సమన్వయం అవసరం
సైబర్ మోసాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం, RBI, బ్యాంకులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాకుండా, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. ఇక, హోం మంత్రిత్వ శాఖ (MHA) గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2021 నుంచి నవంబర్ 2025 వరకు దాదాపు రూ.52,000 కోట్లకు పైగా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఈ మొత్తం అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ను మించిపోవడం గమనార్హం. ఈ స్థాయిలో మోసాలు జరగడం దేశ ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పుగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్లను కట్టడి చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజల సొమ్ము రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.