CM KCR will visit Maharashtra in ten days, Minister Indrakaran Reddy: భారత రాష్ట్ర సమితిని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పటికే వచ్చే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈ రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహారాష్ట్రలో పర్యటించారు. నాందేడ్ జిల్లా కీనిలో ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలతో సమావేశం అయ్యారు. తెలంగాణలో రైతులు అంతా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. రైతులకు తెలంగాణ సర్కార్ అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. మహారాష్ట్రలో రైతులకు కేవలం 6 గంటలు కరెంట్ మాత్రమే ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తున్నామని వెల్లడించారు.
Read Also: RC 15: అభిమానులే శత్రువులు… ఇలాంటివి లీక్ చేస్తే ఎలా?
తెలంగాణలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బీమాను అమలు చేస్తుందని తెలిపారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా వాళ్ల కుటుంబానికి 8 రోజుల్లో 5 లక్షల చెక్ అందిస్తున్నామని పేర్కొన్నారు. పది రోజుల్లో నాందేడ్ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తారని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందో అలాగే మా రాష్ట్రంలో కూడా పథకాలను అమలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని పెద్దపెద్ద నాయకులు కోరుతున్నారని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తామని అన్నారు.