నల్లగొండ పట్టణాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని.. నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని.. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని వెల్లడించారు.. నల్లగొండను అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించిన కేసీఆర్.. అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు ఇస్తుందని.. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని స్పష్టం చేశారు.. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ పరిశీలించాలని, అందుకు పాదయాత్ర చేపట్టాలని సూచించారు సీఎం.. నల్లగొండ మున్సిపాలిటీలో మౌలిక వసతులు మెరుగుపరచడం, పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Also: కొత్త ఇల్లు కొనేవారికి శుభవార్త.. షరతులు ఇవే..!
నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే మున్సిపల్ కమిషనర్ ను వెంటనే నియమించాలన్నారు సీఎం కేసీఆర్.. ఈ మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా ఫోన్లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ధి చేసే దాకా నిద్రపోవద్దని, సిద్దిపేటను తీర్చిదిద్దినట్లుగా నల్లగొండనూ తీర్చిదిద్దాలని అన్నారు. నల్లగొండలో స్ట్రీట్ లైట్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన.. విద్యుత్ పరిస్తితిని మెరుగు పరిచేందుకు వెంటనే కావాల్సినన్ని సబ్ స్టేషన్లు నిర్మించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. టౌన్లోని అనువైన స్థలాలను ఎంపిక చేసుకొని, వాటిలో వెంటనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని, రైతు బజార్లు నిర్మించాలన్నారు. ఉదయసముద్రం అద్భుతమైన నీటి వసతితో కళకళలాడుతున్న నేపథ్యంలో.. ట్యాంక్ బండ్ ను సుందరీకరించాలని చెప్పారు. నల్గొండ వాసులకు ఆహ్లాదకరమైనరీతిలో అర్బన్ పార్కును అందుబాటులోకి తేవాలన్నారు. సభలు సమావేశాలకోసం అధునాతన సౌకర్యాలతో రెండు వేల మంది సామర్థ్యం తో కూడిన టౌన్ హాల్ నిర్మించాలన్నారు. ఇందుకోసం నగరం నడబొడ్డున అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.
నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫుట్ పాత్ లు నిర్మించాలని సూచించారు కేసీఆర్.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ఉప్పల్ భగాయత్ మాదిరిగా లాండ్ పూలింగ్ చేపట్టి, కాలనీల నిర్మాణానికి పూనుకోవాలన్నారు. గతంలో నల్లగొండ పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేదని, మిషన్ భగీరథ పథకంతో ఆ సమస్య తీరిపోయిందని అధికారులు సీఎం కు వివరించారు. మరోవైపు.. డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిపై ఆరా తీశారు. వైకుంఠధామాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు వేర్వేరుగా శ్మశాన వాటికల నిర్మాణాన్ని ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. ఇక, ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి, దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇంటి క్వార్టర్లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం కేసీఆర్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అక్కడే నివాసం ఏర్పరచుకున్న కాలనీవాసులతోపాటు, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలు ఉన్నాయని, అక్కడ కూడ అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని,. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారికి శాశ్వత పట్టాలు కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఫోన్లో ఆదేశించారు కేసీఆర్.
మాట ఇచ్చినపుడు ఆ మాట నిలబెట్టుకోవడం ధర్మమని, మనది ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇపుడు ఎన్నికల కోడ్ కూడా తొలగిపోయినందున అర్హులైన సాగర్ కాలనీవాసులకు, నియమ నిబంధనలను అనుసరించి, కొంత వెసులుబాటును కల్పించి అయినా సరే, పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దాల క్రితం ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా పేద కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే అధికంగా పాల్గొన్నారు, వారు ఇక్కడే నివాసమున్నారు, అలాంటిదే ఇక్కడ కూడా నాగార్జున సాగర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. వారంతా తక్కువ స్థలాల్లోనే ఇండ్లు కట్టుకున్నారు, వారందరికీ పట్టాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది.’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.