ఫలితాలు ఊరికే రావు. ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యాచరణలో అధికారులు శ్రద్ధాసక్తులతో, చిత్తశుద్ధితో పాల్గొన్నప్పుడే ఫలితాలు సాధ్యమైతాయని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుతుగున్న ఈ సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. “విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తున్నదని అన్నారు సీఎం. అన్ని కష్టాలను అధిగమించి మనం నేడు దేశం గర్వించే స్థాయిలో ధ్వంసమైన తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.
తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం.. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నామని తెలిపారు. ప్రతీ పల్లెలో ఇవ్వాల ఒక ట్రాక్టర్ ను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయని తెలిపారు.
నేను గతంలో చెప్పినట్టు… ఎస్ కె డే గారు ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉద్యమమని, కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించి అవి అన్ని రకాలుగా పంచాయతీ రాజ్ స్ఫూర్తి చంపివేయబడ్డదని అన్నారు. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడ్డది. ఇటువంటి అరాచకమైన, నిర్లక్ష్యమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చిన ప్రారంభంలో నేను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ అడవులేంది అని కొందరు నవ్వుకున్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదని అన్నారు సీఎం కేసీఆర్.
అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారని అన్నారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.
KCR: కేంద్రంపై కేసీఆర్ ఫైర్.. అది చిల్లర వ్యవహారం..!