కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన కారులు వింధ్వంసం సృష్టించిన అందోళన కారులను కొద్ది సేపటికి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన కారులను రైల్వే స్టేషన్ నుంచి పోలీసు వాహనాలలో తరలించారు. అయితే ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 143, 147, 324, 307, 435,427, 448, 336, 332, 341,రెడ్ విత్ 149 సెక్షన్లతో పాటు ఇండియన్ రైల్వే యాక్ట్ 150, 151, 152, కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. రైల్వే ఉద్యోగి రాజా నర్సు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఇంకా కేసు దర్యాప్తు చేయాల్సి ఉందని, ఎంత మంది దాడిలో పాల్గొన్నారో ఇంకా గుర్తించలేదన్నారు. ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదని, పలువురు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నామని ఆమె మీడియాకు వివరించారు. రైళ్లు రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని, మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రాకుండ ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.