BRS Protest : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చిన BRS

  • హైకోర్టు స్టేపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం
  • కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ అత్యవసర టెలీకాన్ఫరెన్స్
  • అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలకు పిలుపు
  • సిద్దిపేట నిరసనలో హరీష్ రావు పాల్గొననున్నట్లు ప్రకటన
Brs

Brs

BRS Protest: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరసనల సెగ రాజుకుంది. పేద మహిళల పెళ్లిళ్ల కోసం అందించే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్లనే కోర్టులో స్టే వచ్చిందని ఆరోపిస్తూ, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.

కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

పథకాలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సంక్షేమ పథకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం కోర్టులో బలమైన వాదనలు వినిపించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పేదల ఇళ్లలో పెళ్లిళ్లకు ఆధారమైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.

అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు

పార్టీ నిర్ణయం ప్రకారం రేపు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఆర్డీవో (RDO) కార్యాలయాల ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సిద్దిపేటలో జరగబోయే నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తానీరు హరీష్ రావు స్వయంగా పాల్గొననుండగా, మిగతా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలియజేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

సెప్టెంబర్ అసెంబ్లీ సవాల్‌కు సిద్ధం

ఇటీవల పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పాటు తమ రెండున్నరేళ్ల పాలనపై చర్చకు కేసీఆర్‌ను కూడా సభకు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై స్పందించిన బీఆర్‌ఎస్ నేతలు, అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ వైఫల్యాలను, నిరుద్యోగులు, రైతులు , ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.