KCR: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. నిపుణులైన వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కాగా, గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయనను ఇవాళ డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జి అనంతరం బంజారాహిల్స్లోని నందినగర్లోని ఆయన నివాసానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎర్రవెల్లిలోని తన ఫోమ్ హౌస్లో ఏ కాస్త సమయం దొరికినా గడపడం కేసీఆర్కు ఇష్టం. అయితే అదే ఫోమ్ హౌస్లో జారిపడటంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
Read also: Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. పెన్షన్ రూ.3వేలకు పెంపు..!
అయితే కేసీఆర్ గాయపడిన విషయం తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలని నాయకులు, ప్రజలు, అభిమానులు ప్రార్థించారు. మరోవైపు కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీలకు అతీతంగా నేతలంతా ఆస్పత్రి వద్ద బారులు తీరారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా కేసీఆర్ను పరామర్శించి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు చిరంజీవి, నాగార్జున వంటి సినీ ప్రముఖులు కూడా గులాబీ అధినేతను పరామర్శించారు. కేసీఆర్ను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కేసీఆర్ అభిమానులు యశోద ఆస్పత్రికి తరలివచ్చారు. అయితే.. ఎవరూ ఆస్పత్రికి రావద్దని కేసీఆర్ స్వయంగా చెప్పారు.
పెద్దసంఖ్యలో జనం రావడంతో ఆసుపత్రిలోని ఇతర రోగులకు ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ప్రజల్లోకి వస్తానని వీడియో సందేశం ఇచ్చారు. అయితే.. కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో.. పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికే పరిమితం కాకుండా.. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ మెదడుకు పని కల్పిస్తూనే ఉన్నారు. సాధారణంగా.. కేసీఆర్ కు చదవడం అంటే మక్కువ కాబట్టి.. ఇప్పుడు ఆస్పత్రిలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. ప్రముఖ పుస్తకాలు తీసుకొచ్చి చదివేవాడు. చాలా మంది సందర్శనకు వస్తుండగా, వారిని కలుసుకున్న తర్వాత, పుస్తకాలు చదవడం ద్వారా మిగిలిన సమయాన్ని వినియోగిస్తున్నారు.
Deepika Padukone: తిరుమలకు దీపికా పదుకొణె.. మెట్లపై నుంచి కాలినడక..