హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్కి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అడ్డుకునే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారు. 66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 టీఎంసీలు రావాల్సి ఉంది. 299 టీఎంసీల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. పంతాలు, పట్టింపులకు వెళ్లి జూరాల దగ్గర ప్రాజెక్టుని మార్చారు.
జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు అని డీకే అరుణ ఆరోపించారు. 203 జీవో విడుదల చేసి 6 వేల కోట్లతో ఉత్సాహంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. లోపాయకారి ఒప్పందంతోనే రాయల సీమ ప్రాజెక్టు నడుస్తుంది. అటు ఇటు ఒకే కాంట్రాక్టర్ ఉన్నప్పటికీ ఎందుకు ప్రాజెక్టు పనులు ఆపలేదు. కేఆర్ఎంబీ టేలిమెట్రిస్ ఏర్పాటు చేయాలని సూచించినా ఇప్పటికి ఏర్పాటు చేయలేదు. ఏ ఒప్పందంతో కృష్ణ జలాలను తాకట్టు పెట్టారని కేసీఆర్ని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ కి తెలంగాణ ప్రజల ఉసురు తగలక మానదు. కుర్చీ వేసుకొని కడతానన్న కేసీఆర్ 7 ఏళ్లుగా ఎక్కడున్నారు? 7 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు. కేసీఆర్ జుటా కోర్.. జూరాల దగ్గర రోజు 5 టీఎంసీల నీరు తీసుకునే విధంగా ప్రాజెక్టు కట్టాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉంది’ అని డీకే అరుణ తెలిపారు.