Site icon NTV Telugu

Bhatti Vikramarka : విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారు..

Bhatti

Bhatti

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ఓటర్ మహాశయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం , పీసీసీ తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అభివృద్ధికి, సంక్షేమానికి , విశ్వసనీయతకే ప్రాధాన్యత ఇస్తారని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రతిపక్షాలు గాలి కబుర్లు, కట్టుకథలతో అసత్య ప్రచారాలు చేశాయని ఆయన మండిపడ్డారు. లేనివి ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసిన వారికి, ఓటర్లు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని, వారి అసలు స్థానం ఏంటో చూపించారని ఎద్దేవా చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఈ విజయం తమ ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. “ప్రజలు ఈ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిపాలనను భవిష్యత్తులోనూ అందిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఈ తీర్పు ఒక ఆమోదముద్ర అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి తాజా గణాంకాలను భట్టి వెల్లడించారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటికే 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయనడానికి ఈ భారీ విజయమే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

Ragi Pittu: ఆడపిల్లలకి అమృతం లాంటి ఆహారం.. నెలలో 3 సార్లు ఇది తింటే నడుము నొప్పి, నీరసం పరార్!

Exit mobile version