భక్తితో దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఓ ప్రాణాన్ని బలిగొంది. బేగంపేట్లో నివసిస్తున్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి పూజ చేస్తుండగా దీపం మంటలు చీరకు అంటుకుని సజీవ దహనమయ్యారు. ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అగ్నికి ఆహుతి కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ బేగంపేట్ పరిధిలో నివసిస్తున్న విజయలక్ష్మి (రిటైర్డ్ ప్రిన్సిపాల్) ప్రతిరోజూ లాగే శుక్రవారం కూడా ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటున్నారు. పూజలో భాగంగా దీపారాధన చేస్తున్న సమయంలో ఆమె కట్టుకున్న చీరకు ప్రమాదవశాత్తు దీపం మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో ఆమె వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు.
అయితే, మంటలు ఒక్కసారిగా ఇంట్లోని సోఫా , కర్టెన్లకు కూడా అంటుకోవడంతో క్షణాల్లో ఇల్లంతా దట్టమైన పొగ కమ్మేసింది. మంటల తీవ్రత , ఊపిరాడని పొగ కారణంగా విజయలక్ష్మి తప్పించుకోలేక అక్కడే కుప్పకూలిపోయారు. మంటలు మరింతగా వ్యాపించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. విజయలక్ష్మి ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
KKR Unwanted Record: కేకేఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. కోల్కతా చరిత్రలోనే..!
ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే విజయలక్ష్మి మంటల్లో కాలి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. విజయలక్ష్మి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూజ చేసే సమయంలో ప్రమిదలు, దీపాలు పెట్టుకునేటప్పుడు మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
