ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదివారం ఖమ్మంకు వెళ్లారు. సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి, సీఎంఓ కార్యాలయం నుంచి కొంతమంది అధికారులు ఇచ్చే అదేశాల ప్రకారమే ఖమ్మం పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నా చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారణం అంటూ సాయి చెప్పాడని .. మరణ వాంగ్మూలం తీసుకోవాలని డాక్టర్లు కుడా సమాచారం ఇచ్చారని అయినా పోలీసులు వాంగ్మూలం తీసుకోలేదన్నారు.
కమ్మ సంఘం ఎన్నికల్లో కమ్మ కులస్థులే నిన్ను గుర్తించలేదని, ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు ఉంటే మంత్రి పువ్వాడ అజయ్ పై చర్య తీసుకునే వాళ్లంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. సాయి గణేష్ మా కమ్మ వాడు అని కమ్మ వర్గీయులు తల ఎత్తుకుంటున్నారని, కమ్మ కులస్తులు ఎవ్వరు కూడా అజయ్ ని నమ్మడం లేదన్నారు. అజయ్ ని వదిలే ప్రసక్తే లేదని అమిత్ షా చెప్పారని, ప్రభుత్వంలో ఉన్న లేక పోయినా ఎప్పుడు అజయ్ ని వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మర్డర్ లు చేసేవాళ్ళు, క్రిమినల్స్ రౌడీ లు కబ్జా దారులు రాజ్యమేలుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.