తెలంగాణ సీఎం కేసీఆర్కు మరోసారి బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డ ఆయన.. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న ఈ తరుణంలో వాటిని దారి మళ్లించేందుకే ప్రధానమంత్రి గారికి బహిరంగ లేఖ పేరిట మీరు కొత్త డ్రామాకు తెరదీసినట్లు కన్పిస్తోంది అని ఎద్దేవా చేశారు.. ఇక, సీఎం ముందు కొన్ని డిమాండ్లను పెట్టిన బండి సంజయ్.. వాటిని ఉగాది వరకు అమలు చేయాలి.. లేకుంటే ఉద్యమం చేస్తామని డెడ్లైన్ పెట్టారు..
Read Also: తెలంగాణ, ఆంధ్ర సీఎంలు కలిసి రావాలి..!
బండి సంజయ్ డిమాండ్లు ఇలా ఉన్నాయి..
- 2017 ఏప్రిల్ 13న మీరు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలి.
- ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి.
- వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా రాష్ట్రంలో రైతులు పండించే పంట ఉత్పత్తులకు క్వింటాల్కు రూ.500 చొప్పున ‘బోనస్’ ప్రకటించాలి.
- కేంద్రం కేటాయించిన నిధులను తక్షణమే ఖర్చు చేసి రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించడంతోపాటు పంటల ప్రణాళికను ప్రకటించాలి.
- వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలి. పార్టీ కార్యకర్తలకు గాకుండా అర్హులైన రైతులకు మాత్రమే వాటిని అందించాలి.
- గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్దరించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలి.
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.
- విత్తన సబ్సిడీని పూర్తిగా అమలు చేయాలి. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలి.
- అకాల వర్షాలకు నష్టపోతున్న రైతాంగానికి ఆదుకునేందుకు ‘క్రాప్ ఇన్సూరెన్సు’ పథకాన్ని అమలు చేయాలి.
- మార్కెట్లో ‘ఈ-నామ్’ పద్దతిని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయాలి.
- బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. అని డిమాండ్ చేశారు బండి సంజయ్.
