బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద రేపు జరపతలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య గొంతు నులిమేసే కుట్ర అని, సీఎం ధర్నా చేస్తే ఒప్పు….బీజేపీ దీక్ష చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం… ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడండి అని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ను కొనసాగించి తీరుతామని ఆయన వెల్లడించారు.
ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదిక ఇందిరాపార్క్ ధర్నా చౌక్ అని, ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరాపార్క్ను ధర్నా చౌక్ గా పునరుద్దరించిన తరువాత టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు నిర్వహించాయన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాయని, అప్పుడే లేని ఇబ్బంది బీజేపీ దీక్ష చేపడతానంటేనే వస్తోందా..? అని ఆయన ప్రశ్నించారు.