కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన అన్నారం (సరస్వతీ) బ్యారేజ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజ్ గేట్ల వద్ద, పిల్లర్ల సమీపంలో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వుతుండటంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తర్వాత, అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఈ పరిణామాలు ప్రాజెక్టు భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దీనిపై ‘NTV’ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడైన అసలు విషయాలు ఇవే.
అన్నారం బ్యారేజ్ అప్ స్ట్రీమ్ (ఎగువన) , డౌన్ స్ట్రీమ్ (దిగువన) వందలాది లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. గేట్లకు అత్యంత సమీపంలో, పిల్లర్ల (Piers) కింద ఇసుకను తోడేయడం వల్ల పునాదులు బలహీనపడి బ్యారేజ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా వరదలు వచ్చినప్పుడు గేట్లను ఎత్తి ఉంచడం వల్ల, ఈ ప్రాంతంలో భారీగా ఇసుక మేటలు వేశాయి. ఇప్పుడు ఆ ఇసుకను తీయడం వెనుక రాజకీయ కుట్ర ఉందా లేదా ఇది సాంకేతిక అవసరమా అన్నది వివాదంగా మారింది.
Iran Attack on Saudi: సౌదీ అతిపెద్ద రిఫైనరి ‘‘అరామ్కో’’పై ఇరాన్ మళ్లీ దాడి..
ఈ వివాదంపై ఇరిగేషన్ శాఖ , తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TG-MDC) అధికారులు స్పష్టతనిస్తున్నారు. ఇది వాణిజ్యపరంగా ఇసుకను అమ్ముకోవడానికి చేస్తున్న తవ్వకం కాదని, కేవలం బ్యారేజ్ భద్రతను పరీక్షించడానికి చేపట్టిన ‘పూడికతీత’ (Desiltation) అని వారు చెబుతున్నారు.
గత రెండు సీజన్లలో సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్ల, బ్యారేజ్ వెంట్లలో సుమారు 15 అడుగుల (5 మీటర్లు) ఎత్తు వరకు ఇసుక పేరుకుపోయింది. దీనివల్ల గేట్లను కిందకు దించడం అసాధ్యంగా మారింది. మేడిగడ్డ తరహాలో ఇక్కడ కూడా లీకేజీలు ఉన్నాయన్న అనుమానంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రంగంలోకి దిగింది. బ్యారేజ్ పటిష్టతను తెలుసుకోవడానికి జియో-టెక్నికల్, జియో-ఫిజికల్ వంటి 9 రకాల కీలక పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
బ్యారేజ్ పునాదులు ఎంత లోతులో ఉన్నాయి? పిల్లర్ల కింద సిమెంట్ బ్లాకులు సురక్షితంగా ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకోవాలంటే భూమి లోపలికి రంధ్రాలు చేసి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే, 15 అడుగుల మేర ఉన్న ఇసుక అడ్డంకిగా మారడంతో, ఆ ఇసుకను తొలగిస్తేనే శాస్త్రవేత్తల బృందం పరీక్షలు చేయగలదని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి, సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇసుక తీసే సమయంలో బ్యారేజ్ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం నిరంతరం స్పాట్ లోనే ఉండి పర్యవేక్షిస్తోంది. పిల్లర్ల చుట్టూ ఇప్పటికే గ్రౌటింగ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి నుంచి తీసిన ఇసుకను TG-MDC ద్వారా ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ లో నిబంధనల ప్రకారమే విక్రయిస్తున్నామని, ఇందులో ఎటువంటి అక్రమాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు.
మొత్తానికి అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఇసుక తవ్వకాలు కేవలం పూడికతీత మాత్రమేనని, బ్యారేజ్ భద్రతను నిరూపించే పరీక్షల కోసమే దీన్ని చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా ప్రాజెక్టుకు తీరని నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వర్షాకాలం లోపు ఈ పరీక్షలు పూర్తయితేనే అన్నారం బ్యారేజ్ భవితవ్యంపై ఒక స్పష్టత రానుంది.
Telangana Govt Key Decision: మార్చి 8న అసెంబ్లీలో భారీ మార్పులు..!