Adulterated Food in Hyderabad: రోజురోజుకు ఎక్కడ చూసినా కల్తీ కాని ఆహారం పదార్థం ఉందా అని అనుమానాలు పెరుగుతున్నాయనడంలో అతిశయోక్తిలేదు. ఎందుకంటే.. ఎక్కడ చూసినా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నారు దుర్మార్గులు. కనీస మానవత్వం కూడా లేకుండా ధనార్జనే లక్ష్యంగా ఈ కల్తీదందా నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి పరిధిలో కల్తీ నూనెలు, గోధుమ పిండి తయారీ గుట్టు రట్టు చేశారు SOT పోలీసులు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ SOT పోలీసులు పట్టుకున్నారు. శేరిలింగంపల్లి SOT టీమ్ గచ్చిబౌలి పరిధిలోని వట్టి నాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ జస్నాత్ ట్రేడర్స్ అనే దుకాణంపై దాడి నిర్వహించారు.
దాడిలో రాజస్థాన్కు చెందిన దుకాణ యజమాని గడువు ముగిసిన వివిధ కంపెనీల వంట నూనెలను సేకరించి, వాటిని సోయాబీన్ నూనెతో కలిపి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్ పూజా ఆయిల్ వంటి పేర్లతో మళ్లీ ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా పలు కంపెనీలకు చెందిన గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాత్ గోల్డ్ చక్కి అట్టా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నట్లు బయటపడింది.
G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!
ఈ దాడిలో పోలీసులు మొత్తం 5,026 లీటర్ల కల్తీ వంట నూనె (సుమారు రూ.10,55,460 విలువ) , 5,192 కిలోల గోధుమ పిండి (సుమారు రూ.3,11,520 విలువ) స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా ఒక వెయింగ్ మెషిన్, ఒక ఆయిల్ ఫిల్టర్ మెషిన్, ఒక గోధుమ ఫిల్టర్ మెషిన్, ఖాళీ సంచులు, రెండు మొబైల్ ఫోన్లు , TS07UL2884 నంబర్ టెంపో ట్రాలీ ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ.21,91,980గా అంచనా వేశారు. ఈ కేసులో రాజస్థాన్కు చెందిన భన్వర్ రామ్ జాట్ (46) అతని కుమారుడు, అశోక్ కుమార్ (22)లను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
G7 Meeting: జీ7 దేశాలు అత్యవసర భేటీకి పిలుపు.. చమురుపై కీలక చర్చ!