పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం , రచ్చపల్లి గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్కు రైతుల కష్టాలు ఎన్నడూ కనిపించలేదని, ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరామర్శల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. గతంలో కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతే అప్పటి సీఎం కేసీఆర్ కనీసం బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రైతులకు నేరుగా అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి చిల్లర రాజకీయం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
నంది మేడారం, రచ్చపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను దారుణంగా మోసం చేసిందని, ఆ హామీని ఎన్నడూ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని నిలబెట్టుకుంటుందని, పేద వర్గాలకు ఇళ్ల నిర్మాణంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.

