Story Board: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్…సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ఊరించే ప్రకటనలు…సెలబ్రెటీల ప్రచారంతో…అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులనుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల దాకా…వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. కోట్లు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్లో పెడుతున్నారు. అది సరిపోక…బ్యాంక్ల నుంచి లోన్లు తీసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. బెట్టింగ్ యాప్స్…సామాన్యులకు మరణశాసనం రాస్తున్నాయి. బెట్టింగ్ ఆడవద్దని చెబుతున్నా…కొందరు పట్టించుకోవడం లేదు. డబ్బు పొగొట్టుకున్న తర్వాత…ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇంకొందరు దొంగలుగా మారుతున్నారు. మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు.
నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్లు సెలబ్రెటీలు, క్రికెటర్లు, ఇన్ఫ్లూయోన్సర్లు వ్యవహరిస్తున్నారు. సినిమా నటులు, క్రీడాకారులు, ఇన్ఫ్లూయోన్సర్లు…కాసుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఎవరు ఎలా పోతే ఏంటి ? మాకు కావాల్సిందే డబ్బే…అంతేకాని ప్రజలు అక్కర్లేదనేలా సెలబ్రెటీలు వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందు బెట్టింగ్కు ఎంతో మంది బలవుతున్నా…సెలబ్రెటీలు మాత్రం పట్టించుకోవడం లేదు. శవాల మీద పైసలు ఏరుకున్నట్లు…బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి…కోట్లు వేనకేసుకుంటున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన క్రీడాకారులు, సినిమా నటులు, సెలబ్రెటీలు, ఇన్ఫ్లూయోన్సర్లు…నోట్ల వేటలో మునిగి తేలుతున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా ఏం లేదు. అందరూ ఆ తాను ముక్కలే. పైసల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. సమాజం గురించి ఆలోచించకుండా…స్వలాభం ధ్వేయంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు.
ఎంతసేపూ కాల్షీట్, రెమ్యూనరేషన్ సంగతే చూసుకుంటున్నారు కానీ.. ఓ సెలబ్రిటీగా తాము చేసే ప్రకటన ప్రభావం అభిమానులపై తీవ్రంగా ఉంటుందని ఆలోచించడం లేదు. మా డబ్బులు మా కొస్తే అంతే చాలు.. ఎవరేమైపోతే మాకేం అన్నట్టుగా ఉంటోంది వీరి తీరు. సెలబ్రిటీలకు సంపాదనకేం తక్కువ లేదు. ఇప్పటికే రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా సరే కాసుల కోసం కక్కుర్తి పడి.. అనైతికంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా కోట్ల మందిని తప్పుదోవ పట్టించే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ.. అందుకు భారీగా రెమ్యూనరేషన్లు తీసుకునే సెలబ్రిటీలకు…సామాన్యుల ఆత్మహత్యల్లో…నిర్వాహకులతో సమానంగా బాధ్యత లేకుండా ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మొత్తం రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇటీవల ఈకేసులో రైనా, ధావన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ‘1xBet’ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఈ అక్రమ బెట్టింగ్ యాప్లు అనేక మందిని లూటీ చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పెట్టుబడిదారులు మోసం చేసి రూ.కోట్లు పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది. అందుకే గతంలోనే ఈ ఇద్దరికీ ఆడీ సమన్లు జారీ చేసి, విచారించింది. తాజాగా ఈ ఇద్దరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
అక్రమ బెట్టింగ్ యాప్ 1xBetకు…శిఖర్ ధావన్ ప్రమోషన్స్ చేస్తూనే భాగస్వామిగా ఉన్నాడని ఈడీ అనుమానిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్తో ధావన్కు ఏం సంబంధం అనే కోణంలో విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే గత సెప్టెంబర్లో ఈడీ విచారించి, వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. అటు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాడన్న అభియోగాలపై రైనాను కూడా ఇప్పటికే 8 గంటలకు పైగా విచారించింది. అతడికి కూడా బెట్టింగ్ యాప్స్లో షేర్ ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసు విషయంలో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలకు నోటీసులు ఇచ్చింది.
ఈ నలుగురు మాజీ ఆటగాళ్లు ‘1xBet’ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ బెట్టింగ్ యాప్లు అనేకమందిని లూటీ చేసినట్లు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పెట్టుబడిదారులు మోసం చేసి రూ.కోట్లు పన్నులు ఎగవేసినట్లు వెల్లడైంది. గత 18ఏళ్లుగా ఈ కంపెనీ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లపై బెట్టింగ్ వేస్తే భారీ మొత్తం గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తోంది. ఈ ఆటగాళ్ల నుంచి యాప్కు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాల గురించి ఈడీ సమాచారాన్ని సేకరించింది. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ యాప్ 70 భాషల్లో ఉండటం చూసి…దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. అయితే ప్రస్తుతం ఈడీ దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. ఈ అక్రమ యాప్ ప్రమోషన్లో లేదా మరేదైనా విధంగానైనా ఆటగాళ్ల పేర్లు లేదా ఫొటోలను ఉపయోగించారా అనే దానిపై ఏజెన్సీ దృష్టి పెట్టింది.
క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ధావన్పై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే క్రికెటర్లు…ఆదర్శం ఎలా అవుతారని ప్రశ్నించారు. బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారని అన్నారు. అమాయకుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని…వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రెటీలు…వీటన్నింటికీ బాధ్యులు కారా..? సమాజ మేలు కోసం, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పాలని సజ్జనార్ సూచించారు. అంతే కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవ పట్టించి.. వారి ప్రాణాలను తీయకండి అంటూ ఎక్స్లో సజ్జనార్ పోస్టు పెట్టారు.
సమాజంలో సెలబ్రెటీలుగా చలామణి అవుతున్న వారికి…కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా ? కోట్లు కూడబెట్టడానికి కంత్రీ పనులు చేస్తారా ? డబ్బులిస్తే మాత్రం…బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తారా ? అన్న విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తున్న సెలబ్రెటీలకు బుద్ది చెప్పాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మంచిని ప్రచారం చేయాల్సిన సెలబ్రెటీలు…బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ఆడండి…కోట్లు సంపాదించండి అంటూ క్యాంపెయిన్ చేయడం ఎంత వరకు సమజసమని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. సమాజానికి మంచి చేయాల్సిన సెలబ్రెటీలు…నలుగుర్ని సన్మార్గంలో నడిపించాల్సిన క్రీడాకారులు…ఆదర్శంగా ఉండాల్సిన నటులే…డబ్బు కోసం ఎంతకైనా దిగుజారుతారా అని విమర్శిస్తున్నారు.