NTV Telugu Site icon

Viacom 18: భారీ ధరకు మహిళల ఐపీఎల్ హక్కులు కొనుగోలు చేసిన రిలయన్స్ కంపెనీ

Viacom 18

Viacom 18

Viacom 18: పురుషుల క్రికెట్ తరహాలో మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ పెంచాలని బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్‌ ప్రసార హక్కులకు భారీ ధర లభించింది. మహిళల ఐపీఎల్‌కు సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రూ.951 కోట్లతో వయాకామ్ 18 సంస్థ బిడ్డింగ్ వేసింది. అంటే ఒక మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు చెల్లించ‌నుంది. పురుషుల జ‌ట్టుతో స‌మాన వేతనం త‌ర్వాత‌.. మ‌హిళ‌ల క్రికెట్‌కు ఇది మ‌హర్దశ అని.. అతిపెద్ద, కీల‌క‌మైన అడుగు అంటూ జై షా ట్వీట్ చేశారు.

Read Also: Team India: బుమ్రా లేని లోటు సిరాజ్ తీరుస్తున్నాడా?

తాజా ఒప్పందం ప్రకారం 2023 నుంచి 2027 వరకు మహిళల ఐపీఎల్ హక్కులను వయాకామ్ 18 కలిగి ఉంటుంది. ఇదే సంస్థ పురుషుల ఐపీఎల్ డిజిటల్ హక్కులను కూడా పొందింది. అలాగే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA టీ20 లీగ్‌ను కూడా ప్రసారం చేస్తోంది. కాగా మార్చి 5 నుంచి 23 వ‌ర‌కు మ‌హిళ‌ల ఐపీఎల్ తొలి సీజ‌న్ జ‌ర‌గ‌నుంది. మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు పోటీప‌డనున్నాయి. ఇప్పటివ‌రకు మహిళల ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేయ‌లేదు. జ‌న‌వ‌రి 25వ తేదీన మ‌హిళ‌ల ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌ను ఆవిష్కరించ‌నున్నట్టు స‌మాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న మ‌హిళా క్రికెట‌ర్లకు రూ. 50 లక్షలు, రూ. 40 ల‌క్షలు, రూ.30 ల‌క్షల బేస్ ప్రైజ్, మిగ‌తావాళ్లకు రూ. 20 ల‌క్షలు, రూ. 10 ల‌క్షలు క‌నీస ధ‌రను బీసీసీఐ ప్రక‌టించింది.