ఒక్క తప్పు.. కేవలం ఒకే ఒక్క తప్పు వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్లేఆఫ్స్కు వెళ్ళే సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. ఆ తప్పు చేసిన కెప్టెన్ రిషభ్ పంత్.. అందరి దృష్టిలో విలన్ అయ్యాడు. ఒకవేళ ఆ తప్పు జరగకపోయి ఉంటే, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది. ఆ వివరాల్లోకి వెళ్తే..
15వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ మొదట డెవాల్డ్ బ్రెవిస్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి టిమ్ డేవిడ్ వచ్చాడు. శార్దూల్ ఆఫ్ స్టంప్ అవతల బంతి విసిరగా.. దాన్ని కవర్స్ దిశగా పుష్ చేసేందుకు డేవిడ్ ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ పక్కనుంచి నేరుగా కీపర్ చేతిలోకి వెళ్ళింది. ఆ బంతి బ్యాట్కు తాకినట్టు శబ్దం రావడంతో, పంత్ ఔట్కు అప్పీల్ చేశాడు. కానీ, ఫీల్డ్లో ఉన్న అంపైర్ ఔట్ కాదన్నట్టు తలూపాడు. పంత్ వ్యవహార శైలి చూసి.. అతడు కచ్ఛితంగా రివ్యూ తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కాసేపు శార్దూల్తో చర్చలు కూడా జరిపాడు. చివరికి పంత్ రివ్యూకి వెళ్ళలేదు. ఒక బంతి వేసిన.. రీప్లేలో ఆ బంతి బ్యాట్కు తాకినట్టు అల్ట్రా స్పైక్ కనిపించింది.
అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రివ్యూకి వెళ్ళి ఉంటే, గోల్డెన్ డక్గా టిమ్ డేవిడ్ పెవిలియన్ చేరుకునేవాడు. కానీ, రివ్యూకి వెళ్ళపోవడం వల్ల టిమ్ డేవిడ్ సేవ్ అయ్యాడు. ఆ తర్వాత విజృంభించాడు. 11 బంతుల్లోనే 4 సిక్సులు, 2 ఫోర్లతో 34 పరుగులు చేసి.. ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అతని వల్లే మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకవేళ టిమ్ గోల్డెన్ డక్ అయ్యుంటే, ముంబై కచ్ఛితంగా ఓడిపోయేది. ఢిల్లీ ప్లేఆఫ్స్కు చేరుకునేది. కానీ.. పంత్ రివ్యూకి వెళ్ళకపోవడం వల్ల ఢిల్లీ ఇంటి దారి పట్టింది. దీంతో.. పంత్ చేసిన తప్పు వల్ల ఢిల్లీ ఓడిందంటూ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్గా పంత్ పనికిరాడని, అతని వల్లే ఢిల్లీ ప్లేఆఫ్స్కు దూరమైందని విమర్శిస్తున్నారు.