Team India: వన్డే ఫార్మాట్లో టీమిండియా మంచి జట్టే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలి వన్డేలో చెత్త ప్రదర్శనతో బంగ్లాదేశ్పై ఓటమిపాలైంది. దీంతో పలు చెత్త రికార్డులు టీమిండియా ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగా నిలిచింది. ఆదివారం నాడు బంగ్లా చేతిలో ఓటమి భారత్కు వన్డేల్లో 435వ పరాజయం. ఇప్పటి వరకు భారత జట్టు 1018 వన్డేలు ఆడి 435 మ్యాచుల్లో ఓడింది. భారత్తో పాటు శ్రీలంక కూడా వన్డే ఫార్మాట్లో 435 ఓటములు మూటగట్టుకుంది. అయితే భారత్ కంటే శ్రీలంక తక్కువ వన్డేలు ఆడింది. శ్రీలంక 878 వన్డేలు ఆడి 435 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది.
Read Also: Saibaba Temple: సాయి పాదాలమీదే ప్రాణాలు వదిలాడు
మొత్తంగా వన్డే ఫార్మాట్లో అత్యధిక ఓటములు చవిచూసిన జట్లుగా భారత్, శ్రీలంక సమంగా నిలిచాయి. అటు బంగ్లాదేశ్పై ఆదివారం నాడు భారత్ 186 పరుగులకు ఆలౌటైంది. ఇది బంగ్లాపై భారత్కు రెండో అత్యల్ప స్కోరు. అయితే తొలి అత్యల్ప స్కోరు చేసినప్పుడు భారత్ గెలిచింది. 2014లో బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభించడంతో టీమిండియా కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే స్టువర్ట్ బిన్నీ (6/4) ఆరు వికెట్లతో చెలరేగడంతో ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది. మళ్లీ ఇప్పుడు బంగ్లాపై మరోసారి స్వల్ప స్కోరుకే భారత్ ఆలౌట్ అయింది. కానీ ఈ మ్యాచ్లో ఓడిపోయి విమర్శలను ఎదుర్కొంటోంది. కీలక సమయంలో కేఎల్ రాహుల్ క్యాచ్ విడిచిపెట్టడం వల్లే టీమిండియా ఓడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.