Most Consecutive Wins in ICC Tournaments: అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన ఘనత నమోదైంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో టీమిండియా వరుసగా 16 మ్యాచ్లు గెలిచి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ విజయ పరంపర జట్టు స్థిరత్వం, సమిష్టి ప్రదర్శన, కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని జయించే సామర్థ్యాన్ని స్పష్టంగా చూపుతోంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడంతో టీమిండియా ఈ రికార్డు నెలకొల్పింది.
నిన్నటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఆస్ట్రేలియా 2006–2007 మధ్య వరుసగా 15 మ్యాచ్లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఆసీస్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. అదేవిధంగా 2023–2024లో 14 విజయాలు, 2003–2004లో 13 విజయాలతో కూడా ఆసీస్ గొప్ప ఆధిపత్యాన్ని చూపింది. భారత్ 2012–2014 మధ్య 12 మ్యాచ్లు వరుసగా గెలిచిన రికార్డును కూడా కలిగి ఉంది. ఇతర జట్ల విషయానికి వస్తే.. వెస్టిండీస్ (1975–1979), శ్రీలంక (1996–1998), పాకిస్థాన్ (2019–2021) జట్లు వరుసగా 9 విజయాలతో తమదైన ముద్ర వేశాయి.
Also Read: Akhtar-Mohsin Naqvi: క్రికెట్పై ఏమాత్రం అవగాహన లేదు.. మోహ్సిన్ నక్వీపై షోయబ్ అక్తర్ ఫైర్!
తాజా రికార్డుతో భారత్ ఐసీసీ టోర్నీల్లో ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. ఈ గణాంకాలు చూస్తే ప్రపంచ క్రికెట్లో టీమిండియా ప్రస్తుత ఫామ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా పెద్ద టోర్నీల్లో వరుస విజయాలు సాధించడం అంటే జట్టు ప్రతిభ, సరైన వ్యూహం, ఒత్తిడిలో నిలబడే మానసిక దృఢత్వం అవసరం. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ భారత్ మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ఫాన్స్ ధీమాగా ఉన్నారు.
