టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించే దశ నుంచి.. అద్భుతంగా పుంజుకుని ఏకంగా టైటిల్ కొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన భారత్.. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి కప్ సొంతం చేసుకుంది. జట్టు విజయంలో ప్రతి భారత క్రికెటర్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచర ఆటగాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని ప్రతి ఆటగాడి ప్రత్యేకతను ఒక్క మాటలో చెప్పి.. అభిమానులను ఆకట్టుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతూ ‘ఫియర్లెస్ స్ట్రైకర్’ అని పేర్కొన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ను ‘కేరళ కింగ్’గా అభివర్ణించాడు. భారత బౌలింగ్ దళానికి ప్రధాన బలంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను ‘యార్కర్ మెషిన్’ అని కొనియాడాడు. కీలక మ్యాచ్ల్లో జట్టును గెలిపించే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా హార్దిక్ పాండ్యను ‘బిగ్ మ్యాచ్ ప్లేయర్’గా పేర్కొన్నాడు. ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ‘సైలెంట్ పెర్ఫార్మర్’గా అభివర్ణించిన సూర్యకుమార్.. పేసర్ మహ్మద్ సిరాజ్ను ‘ఎనర్జీ బూస్టర్’గా చెప్పాడు. స్వింగ్ బౌలింగ్లో ప్రత్యేకత ఉన్న అర్షదీప్ సింగ్ను ‘స్వింగ్ కింగ్’గా పేర్కొన్నాడు. ఆల్రౌండర్అక్షర్ పటేల్ను ‘కామ్ ఫినిషర్’గా కొనియాడాడు.
Also Read: Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో సందడి, క్రికెట్ స్టార్స్ హాజరు!
యువ ఆటగాళ్ల విషయానికి వస్తే.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ‘ఫ్యూచర్ స్టార్’గా సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. భారీ షాట్లతో ప్రేక్షకులను అలరించే శివమ్ దూబేను ‘సిక్స్ హిట్టర్’గా అభివర్ణించాడు. స్పిన్ బౌలింగ్లో మాయచేసే కుల్దీప్ యాదవ్ను ‘స్పిన్ విజార్డ్’గా పేర్కొన్నాడు. చివరగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను ‘పాకెట్ రాకెట్’గా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. సహచర ఆటగాళ్లపై స్కై చేసిన ఈ వ్యాఖ్యలు జట్టులో ఉన్న అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ విజయంలో ప్రతి ఆటగాడు తనదైన పాత్ర పోషించాడని సూర్య మాటల ద్వారా తెలుస్తోంది. స్కై చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.