IND vs PAK: 23 ఏళ్ల క్రితం సచిన్ పాకిస్తాన్పై ఆడిన ‘‘శివ తాండవం’’ వరల్డ్ క్రికెట్లోనే ఒక మరుపురాని ఇన్నింగ్స్ అయింది. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఈ మ్యాచ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు, కానీ 90వ తరానికి మాత్రం ఈ మ్యాచ్ ద్వారానే క్రికెట్ పరిచయమైందంటే అతిశయోక్తి కాదు. మార్చి 1, 2003 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఈ ఇన్నింగ్స్ను ఎవరూ మరిచిపోరు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి నిప్పులు చెరిగే బాల్స్, సచిన్ ముందు చిన్నబోయాయి. శివరాత్రి రోజు పాకిస్తాన్ను బౌలర్లను సచిన్ టెండూల్కర్ చీల్చి చెండాడారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా సచిన్కు సెహ్వాగ్ జతకట్టి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
23 ఏళ్ల తర్వాత మరోసారి శివరాత్రి రోజే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఫిబ్రవరి 15 ఆదివారం కొలంబో వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఇది కూడా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ కావడం విశేషం. కానీ అప్పుడు వన్డే అయితే, ఇప్పుడు టీ20. ఈ శివరాత్రి కూడా ‘‘భారత్కు శివరాత్రి, పాక్కు కాళరాత్రి’’ కావాలని యావత్ భారత్ కోరుకుంటోంది.
శివాలెత్తిన సచిన్:
దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. గ్రూప్ ఏలో తిరుగులేని విజయాలతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. తరువాతి రౌండ్ క్వాలిఫైయింగ్ బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్ 126 బాల్స్ లో 101 పరుగులు చేసి భారీ స్కోరుకు కారణం అయ్యాడు. అయితే అప్పటి వరకు భారత్ కు 222 కంటె ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఎన్నడూ కూడా విజయవంతంగా ఛేదించలేకపోయిన భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇంత పెద్ద టార్గెట్ను భారత్ ఛేదించలేదని పాక్ జట్టు అంచనాలు మొదటి 5 ఓవర్లలోనే పటాపంచలయ్యాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ జోడిగా వచ్చారు. ఇద్దరు వచ్చీ రావడంతోనే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 5 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేశారు. టీ 20 ఫార్మాట్ అంతగా అందుబాటులోకి రాని రోజుల్లోనే హిట్టింగ్ చేస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్ లో సచిన్ ఆడిన అప్పర్ కట్ షాట్ ఇప్పటికే ఓ క్లాసిక్. సచిన్ ఆడిన షాట్ నే మళ్లీ సెహ్వాగ్ పాక్ బౌలర్లకు రుచి చూపాడు.
సెహ్వాగ్, కెప్టెన్ గంగూలీ వికెట్లు త్వరగానే పడిపోయినా.. మహ్మద్ కైఫ్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ జట్టును విజయతీరాలకు చేర్చి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచులో సచిన్ కేవలం 75 బంతుల్లోనే 98 పరుగులు చేయడంతో పాటు వన్డేల్లో 12,000 పరుగులను పూర్తి చేశాడు. 27వ ఓవర్ లో షాహీద్ అఫ్రీదీ బౌలింగ్ లో సచిన్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తరువాత ద్రావిడ్ 44 పరుగులతో, యువరాజ్ సింగ్ 50 పరుగులు చేసి భారత్ ను గెలిపించారు. 6 వికెట్ల నష్టానికి మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది.