క్రికెట్ ప్రపంచంలో ‘దేవుడు’గా పిలవబడే సచిన్ టెండూల్కర్ పేరు వినగానే పరుగుల వరద, అద్భుతమైన స్ట్రెయిట్ డ్రైవ్లు, దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ కళ్లముందు కదలాడతాయి. భారతీయులకు క్రికెట్ అంటేనే సచిన్ అనేంతగా ఆయన ముద్ర వేసుకున్నారు. అయితే.. ఏ ఆటగాడికైనా కెరీర్ ముగింపు అనేది అనివార్యం. కానీ.. ఆ ముగింపు ఒక లెజెండ్కు ఎంతటి వేదనను మిగిల్చి ఉంటుందో, తెరవెనుక జరిగిన పరిణామాలు ఎంతటి భావోద్వేగానికి లోనుచేశాయో తాజాగా మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ వెల్లడించిన విషయాలు క్రికెట్ అభిమానులను కలిచివేస్తున్నాయి.
లెజెండ్ ప్రస్థానంలో విషాదం..
సందీప్ పాటిల్ తాజాగా పంచుకున్న వివరాల ప్రకారం.. 2011 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత జట్టు ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ముఖ్యంగా 2012లో ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా పర్యటనల్లో టీమ్ ఇండియా ఎదుర్కొన్న ఘోర పరాజయాలు జట్టును తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి.
ఈ క్లిష్ట సమయంలో జట్టులో మార్పులు తప్పనిసరి అని భావించిన సెలక్షన్ కమిటీ, అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సంఘటనను పాటిల్ గుర్తుచేసుకుంటూ ఇలా అన్నారు.. ఆ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న వాతావరణం చాలా ఉద్విగ్నభరితంగా ఉంది. జట్టు భవిష్యత్తు గురించి చర్చించాల్సి రావడంతో, సందీప్ పాటిల్ స్వయంగా సచిన్ టెండూల్కర్ని ఉద్దేశించి.. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీరు ఇంకా ఆడాలనుకుంటున్నారా..? అని అడగాల్సి వచ్చింది. ఆ ప్రశ్న వినగానే సచిన్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దశాబ్దాలుగా జట్టుకు వెన్నెముకగా ఉన్న ఒక ఆటగాడిని ఇలా అడగడం తనకు కూడా చాలా బాధ కలిగించిందని పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సందీప్ పాటిల్ అడిగిన ఆ ప్రశ్న సచిన్ అంతరాత్మను తాకింది. ఆ తర్వాత జరిగిన చర్చల పర్యవసానంగా.. సచిన్ మొదట వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆపై 2013లో టెస్టు క్రికెట్కు కూడా వీడ్కోలు పలికారు. అప్పట్లో ఇది కేవలం ఒక ఆటగాడి విరమణగా మాత్రమే అందరూ భావించారు, కానీ ఇప్పుడు పాటిల్ బయటపెట్టిన విషయాల ద్వారా.. అది ఒక గొప్ప కెరీర్ ముగింపులో ఉన్న ఆవేదన అని స్పష్టమవుతోంది.
Also Read:GST: తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం.. రూ.84 కోట్లు కొట్టేసిన కేటుగాడు..
అభిమానుల్లో అలజడి..
ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సచిన్ వంటి దిగ్గజానికి కూడా అంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైందా..? అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆటగాడిని పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు గౌరవంగా పంపించడం ఎంత ముఖ్యమో, ఈ సంఘటన ద్వారా మరోసారి చర్చకు వచ్చింది. సచిన్ టెండూల్కర్ కెరీర్ ముగింపు కేవలం గణాంకాలతో ముగియలేదు.. అది కఠినమైన నిర్ణయాలు, బాధ్యతలు, ఎమోషన్స్ కలగలిసిన ఒక సుదీర్ఘ ప్రస్థానం. ఈ నిజాలు సచిన్ పట్ల అభిమానులకు ఉన్న గౌరవాన్ని మరింత పెంచడమే కాకుండా.. క్రీడాకారుల జీవితంలో ఉండే ఒత్తిడిని కూడా ప్రతిబింబిస్తున్నాయి.